భద్రాచలంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్


✍️ దివిటీ మీడియా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో పోలీసులు శనివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో భద్రాచలం టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవెన్యూకాలనీల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ అరుణ్ కుమార్ కాలనీవాసులకు పలు సూచనలు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నేరాల నియంత్రణ కోసం నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు ఆ సమాచారం అందించాలని కోరారు. మహిళలు, పిల్లల భద్రత గురించి పలు సూచనలు చేశారు. ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరుతూ, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. విపత్కర సమయాల్లో, ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100నకు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందాలని సూచనలు చేశారు. దాదాపు 90 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. డీఎస్పీతో పాటు స్థానిక సీఐ నాగరాజు, ఎస్సైలు, సీఆర్పీఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్, సివిల్, స్పెషల్ పార్టీ సిబ్బంది, నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ సహా పాల్గొన్నారు.

