లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు
వివరాలు వెల్లడించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ
✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 18
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు ఎస్పీ రోహిత్ రాజు గురువారం ఆ వివరాలు వెల్లడించారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 81, 141 బెటాలియన్ల అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత” కార్యక్రమం ద్వారా వారు లొంగిపోయినట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకుని, నక్సలిజాన్ని విడనాడి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని వారు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులలో 1 ఏసీఎం, 1 పార్టీ సభ్యుడు, 4 మంది మిలీషియా సభ్యులున్నట్లు తెలలపారు. ఈ ఆరుగురు కొత్తగూడెం జిల్లా ఎస్పీ ముందుకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసినట్లు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత” కార్యక్రమం ద్వారా ఈ ఏడాది (2025) జనవరి నుంచి ఇప్పటివరకు 320మంది లొంగిపోయినట్లు ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. వారిలో 4 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 22 మంది ఏరియా కమిటీ సభ్యులు, 41 మంది పార్టీ సభ్యులు, 120 మంది మిలీషియా సభ్యులు, 35 మంది ఆర్పీసీ సభ్యులతోపాటు కిందిస్థాయిలోని మరో 98 మంది లొంగిపోయి ప్రభుత్వం నుంచి తగిన సౌకర్యాలు పొందారని ఆయన వివరించారు. తెలుగాణ ప్రభుత్వం, పోలీసుశాఖ సరెండర్ పాలసీ ప్రకారం ఆపరేషన్ చేయూత ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగానే మావోయిస్టు కేంద్ర కమిటీ మహిళా సభ్యురాలైన పోతుల పద్మావతి@కల్పన @మైనక్క @సుజాతక్క ఈ నెల 13న తెలంగాణ రాష్ట్ర డీజీపీ ముందు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. ఆమెకు పునరావాసంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరుపున లొంగిపోయిన రోజునే రూ.25 లక్షలు ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ సభ్యులు లొంగిపోయి శాంతియుత జీవనం గడపాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని కూడా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.

