ఖమ్మంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
✍️ దివిటీ మీడియా (ఖమ్మం)
ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ‘ఖమ్మం గిరిజన భవన్’లో ఆదివారం ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఫిరంగి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాసు నాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, గిరిజనులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సకాలంలో చేరే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం గిరిజనజాతుల సమన్వయం కోసం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఆదివాసీలకు ఉపాధికోసం పలు రకాల పథకాలు, ఉద్యోగాలు ఇస్తోందన్నారు. ఆదివాసీ గిరిజన బిడ్డలు చదువులోనూ రాణించాలని సూచించారు. గిరిజనుల పండుగలు, గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వంతో నిధులు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. టి.ఎస్.టి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వీరునాయక్ మాట్లాడుతూ, ఏజెన్సీప్రాంత హక్కులు, గిరిజనాభివృద్ధి కోసం అధికారులు ముందస్తుప్రణాళికతో ఉండాలని, గిరిజనతెగలను సమన్వయ పరుస్తూ ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

