అంగరంగ వైభవంగా గోదావరినదీమాతకు హారతి



✍️ దివిటీ మీడియా (భద్రాచలం)
భద్రాచలం దివ్యక్షేత్రంలో పుణ్య గోదావరి నదీమాతకు హారతి కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. గోదావరినది స్నానఘట్టాల పరాభవనామ సంవత్సర, ఆషాడ బహుళ ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమంలో పురోహితులు భక్తులకు, ప్రజలకు గోదావరినదీ మాత ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని అభిలషించారు. ఈ సందర్భంగా పురోహితులు గోదావరినదీ హారతి విశేషాలు, ఆషాడ బహుళ ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించి, గణపతి పూజ, దీపోత్సవం భక్తులచే సృష్టింపచేసి, పూజాద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారు. లోకకళ్యాణార్థం ప్రతి ఆదివారం చేస్తున్న ఈ మహత్కార్యంలో స్థానికులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని రామానుగ్రహంతో గోదావరిమాత ఆశీస్సులు పొందడంపట్ల పురోహితులు ఆనందం వ్యక్తం చేశారు. గోదావరిమాత, శ్రీసీతారామచంద్రస్వామి వారికిచ్చే హారతుల వల్ల దేశం, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. ప్రజలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అభివృద్ధిచెందుతారని, తాము చేసుకునే పనుల్లో లాభాలు పొందుతారన్నారు. ఈ సందర్భంగా శాంతి మంత్రపఠనం జరిపి అక్కల శ్రీనివాసరాజు, జ్యోతిర్మయి దంపతుల తరఫున ప్రసాదం పంపిణీ చేశారు. నదీ హారతి కార్యక్రమానికి పూజా సామాగ్రిని రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ తరపున అందించారు.
భద్రాద్రి పురోహితులసంఘం అధ్యక్షుడు రామావజ్జుల రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్ శర్మ , సత్య ప్రసాద్ శర్మ, పవన్ కుమార్ శర్మ, రామాచార్యులు, జొన్నవిత్తుల చంద్రశేఖర్, తిరుపతిరావు, ఎన్.ఎస్.ఎన్ రెడ్డి, నరసింహశర్మ, తేజ శర్మ, భక్తులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

