పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : పొంగులేటి

ఏదులాపురం, ఖమ్మం రూరల్ లో మంత్రి శంకుస్థాపనలు
✍️ దివిటీ మీడియా (ఖమ్మం)
తెలంగాణలో పేదల సంక్షేమం, గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలసి ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి గుదిమల్ల వరకు రూ.5 కోట్లతో చేపట్టనున్న రహదారి పనులకు, కామంచికల్ గ్రామం నుంచి కోయచలక వరకు రూ.2.10 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఆయన భూమిపూజ చేశారు. గత 32 నెలల్లో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 8, 10, 11, 12 వార్డుల్లో రూ.21.61 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు దిగ్విజయంగా పూర్తిచేశామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం గ్రామాలను, కొత్త మున్సిపాలిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందన్నారు.
కామంచికల్ గ్రామ అభివృద్ధికి గత 32 నెలల్లోనే రూ.5.66 కోట్లు మంజూరు చేశామని, రెండు నూతన రహదారులు కూడా త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలు, కులాలు, మతాలకతీతంగా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. తొలి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్కు మరో లక్ష కలిపి మొత్తం 8 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. ఇంకా మూడు, నాలుగు విడతల్లో మరికొన్ని ఇళ్లను కేటాయిస్తామని, మరో రెండు మూడు రోజుల్లోనే నూతన మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రైతులకు రుణమాఫీ పూర్తి చేశామని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.6,000 చొప్పున జమ చేయడంతో పాటు, సన్న వడ్లకు మద్దతు ధర, క్వింటాల్కు రూ. 500 బోనస్ అందిస్తున్నామన్నారు. ఈ నెల (ఆగస్టు) 15 నుంచి నూతనంగా వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

