రెండు దొంగతనం కేసులలో నిందితుడికి జైలుశిక్ష, జరిమానా
✍️ దివిటీ మీడియా (పినపాక)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో గతేడాది రెండు దొంగతనం కేసులలో నిందితుడైన వ్యక్తికి భద్రాచలం కోర్టులో ఒక్కొక్క కేసులో ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ, బుధవారం భద్రాచలం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జె.ఎఫ్.సి.ఎం) శివనాయక్ తీర్పునిచ్చారు. ఈ కేసుల్లో బూర్గంపాడు పోలీసులు పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. 2025 లో సారపాకలో రెండు ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసిన షేక్ దారుక్ బాబా అనే వ్యక్తికి ఈ శిక్షలు విధించారు. తమ ఇంట్లో చోరీ జరిగినట్లు సారపాక ప్రాంత కోయగూడెం నివాసి తాజా మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన బూర్గంపాడు పోలీసులు షేక్ దారుక్ బాబా ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి న్యాయస్థానానికి నివేదించారు. దీంతో పాటు సారపాక మసీదురోడ్డులోని తమ ఇంట్లో చోరీ జరిగినట్లు ఐటీసీ కార్మికుడు మల్లెంపూడి గణేష్ కుమార్ ఇచ్చిన మరో ఫిర్యాదుపై కూడా దర్యాప్తు చేసిన బూర్గంపాడు పోలీసులు ఆ ఘటనలో కూడా షేక్ దారుక్ బాబాను నిందితుడిగా న్యాయస్థానానికి నివేదించారు. ఈ రెండు కేసులను అప్పటి బూర్గంపాడు ఎస్సై దేవ్ సింగ్ దర్యాప్తు చేసి కోర్టుకు నివేదించారు. ఈ కేసులలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీధర్ ప్రాసిక్యూషన్ నిర్వహించగా, నోడల్ ఆఫీసర్ ఎస్సై రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ వీరబాబు సహకరించారు. ఈ రెండు కేసులలో విచారణ జరిపిన భద్రాచలం జె.ఎఫ్.సి.ఎం (జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్) శివనాయక్ బుధవారం తీర్పు వెలువరించారు. నిందితుడికి ఒక్కొక్క కేసులో ఒక సంవత్సరం జైలుశిక్ష, రూ.1000 జరిమానా చొప్పున శిక్షలు విధించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

