Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadLife StyleSpot NewsTelanganaWELFAREWomen

ప్రభుత్వాసుపత్రులలో సేవలకు మరింత బలం

ప్రభుత్వాసుపత్రుల్లో సేవలకు మరింత బలం

జిల్లాలో ప్రభుత్వాసుపత్రులకు 69 మంది స్టాఫ్ నర్సులు

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 69మంది స్టాఫ్ నర్సులను ప్రభుత్వం తాజాగా కేటాయించింది. ఈ ఆసుపత్రులు కొన్ని సంవత్సరాల నుంచి స్టాఫ్ నర్సుల తీవ్రకొరత ఎదుర్కొంటూ, రోగులకు సేవల్లో వెనుకబడుతున్నాయి. నర్సుల కొరత కారణంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలు జిల్లాకలెక్టర్ అంకిత్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సహకారంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించింది. ఇటీవలే ఇచ్చిన రెగ్యులర్ నర్సుల రిక్రూట్మెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టీవీవీపీ ఆసుపత్రులకు మొత్తం 69 మంది స్టాఫ్ నర్సులను కేటాయించింది. ఈ నిర్ణయం జిల్లాలో ప్రభుత్వ వైద్య రంగానికి ఒక మైలురాయిగా నిలుస్తూ, ఆసుపత్రుల్లో నర్సింగ్ సేవలను బలోపేతం చేసేలా ఉంది. ఈ అదనపు నర్సింగ్ సిబ్బందితో అత్యవసర, ఇన్‌పేషెంట్, ప్రసూతి, శస్త్ర చికిత్స, ఐసీయూ, తదితర వైద్యసేవలు మరింత సమర్థవంతంగా అందుబాటు లో రానున్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో పెరుగుతున్న రోగుల అవసరాలు మరింత సమర్థంగా ఎదుర్కోవడంలో ఆసుపత్రులకు ఎంతో ఉపశమనాన్ని కలిగించనుంది. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని ఏడు టీవీవీపీ ఆసుపత్రుల నర్సింగ్ సూపరింటెండెంట్లు,డీసీహెచ్‌ఎస్ డా.జి.రవిబాబుతోపాటు శుక్రవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. నర్సింగ్ సిబ్బంది కొరత పరిష్కారానికి చూపిన ప్రత్యేక చొరవ, నిరంతర సహకారం, అలాగే సకాలంలో తీసుకున్న చర్యలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన తెలిపి జిల్లాకు 69 మంది స్టాఫ్ నర్సులను కేటాయించిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్.చోంగ్తుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డా.జి.రవి బాబు, జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రతినిధి డా.వీరబాబు, జిల్లాలోని ఆసుపత్రుల నర్సింగ్ సూపరింటెండెంట్స్ ఫ్లోరెన్స్ పద్మ, భారతి, రేవతి, జయ, ఝాన్సీ, ఆశావర్ధిని, శారద, సీత, రాధాకుమారి పాల్గొన్నారు.

Related posts

భద్రత కరవైన బూర్గంపాడు తహశీల్దారు కార్యాలయం

Divitimedia

బెల్లంపల్లిలో ఘనంగా ఏబీ బర్ధన్ 8వ వర్ధంతి కార్యక్రమం

Divitimedia

డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

Divitimedia

Leave a Comment