భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు (ఆదివారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో బస చేసిన మంత్రి ఆదివారం ఉదయం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయం దర్శించుకోనున్నారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ఆ పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా భూభారతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న భూ రీసర్వే తీరుపై రెవెన్యూ, సర్వే, అటవీశాఖల అధికారులతో సమీక్షించనున్నారు. ఆతర్వాత మంత్రి అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మణుగూరు మండలం ఇల్లందు అతిథిగృహంలో మధ్యాహ్నం భోజనం అనంతరం బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో అతిథిగా పాల్గొననున్నారు. పినపాక పట్టీనగర్- ఒడ్డుగూడెం బీటీ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత పాల్వంచలో దమ్మపేట సెంటర్ నుంచి దమ్మపేట రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మంచికంటినగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి, కొత్తగూడెంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీసు నుంచి గోధుమవాగు వరకు సెంట్రల్ డివైడర్ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి పొంగులేటి పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు.

