సినీఫక్కీలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న పోలీసులు
ఖమ్మం సీసీఎస్ పోలీసులను అభినందించిన వరంగల్, ఖమ్మం సీపీలు
✍️ దివిటీ మీడియా
ఓ ఇంట్లో చోరీకి పాల్పడి చోరీ సొత్తుతో సహా రైలెక్కి పారిపోతున్న అంతర్రాష్ట్ర నిందితులు ముగ్గురిని ఖమ్మం, వరంగల్ జిల్లాల పోలీసులు సమన్వయంతో సినీ ఫక్కీలో చాకచక్యంగా పట్టుకున్నారు… ఈ సంఘటనలో అత్యంత కీలకంగా తమ బాధ్యతలు నిర్వర్తించిన ఖమ్మం సీసీఎస్ పోలీసులను గురువారం ఖమ్మం, వరంగల్ పోలీస్ కమిషనర్లు (సీపీలు) సన్ ప్రీత్ సింగ్, సునీల్ దత్ అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… ఇటీవల వరంగల్ జిల్లా కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆ నిందితులు చోరీ సొత్తుతో సహా రైలెక్కి ఖమ్మం మీదుగా పారిపోతున్నట్లుగా సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా వరంగల్ జిల్లా పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని ఖమ్మం జిల్లా పోలీసులకు అందించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఖమ్మం జిల్లా సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్)కు చెందిన పోలీస్ సిబ్బంది ప్రయాణికుల మాదిరిగా ఖమ్మంలో రైలెక్కి ప్రతి రైలు భోగీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ రైలు మధిరకు వచ్చేసరికి పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎస్.కె.ఫిరోజ్, ఎస్.కె.ఎమిన్, ఎస్.కె.సుఖ్ చంద్ అనే ముగ్గురు నిందుతులను గుర్తించి చాకచక్యంగా పట్టుకుని వరంగల్ జిల్లా పోలీసులకు అప్పగించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కేయూసీ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం.669/2025, 670/2025, 14/2026 (సెక్షన్ 331(3), 305(a) BNS కింద) నమోదైన కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్థులను పట్టుకోవడంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) సిబ్బందిని, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.
ఖమ్మం జిల్లా సెంట్రల్ క్రైమ్ పోలీసులు తక్షణమే స్పందించి, ఆ నిందితులను పట్టుకోవడంలో అమూల్యమైన సహకారం అందించినందుకు వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన అందించిన ప్రశంసాపత్రాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా సిబ్బందికి గురువారం అందజేశారు. ఈ
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, సీసీఎస్ ఏసీపీ సర్వర్ పాల్గొన్నారు.

