అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి…

పాలేరు అభివృద్ధి సమీక్షలో మంత్రి పొంగులేటి
✍️ దివిటీ మీడియా (ఖమ్మం)
పాలేరు నియోజకవర్గంలో సాగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచాలని, వాటి ఫలాలు త్వరితగతిన అందేలా అధికారులు బాధ్యతతో పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ,గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. శనివారం కూసుమంచిలో తన క్యాంపు కార్యాలయంలో ఆయన అభివృద్ధి పురోగతిపై ఖమ్మం జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్, సీపీ సునీల్ దత్ లతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి, నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ నిర్మాణ, మౌళికవసతుల పనులపై శాఖల వారీగా సమీక్షించారు. పాలేరు నియోజకవర్గంలో మంజూరైన పనులు, టెండర్ ప్రక్రియ పూర్తయినవి, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పురోగతిలో ఉన్న పనుల వివరాలు సమీక్షించారు. సాంకేతిక, ఇతర కారణాల వల్ల ఇంకా టెండర్ కాని పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెండర్లు నిలిచిపోయి ఉన్న పనులకు అడ్డంకులను తొలగించి వెంటనే ప్రక్రియ పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు సకాలంలో నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ చేయాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ లేదన్నారు. పెండింగ్ బిల్లుల వివరాలు సమర్పించాలన్నారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనులు వేగంగా సాగేలా చూడాలన్నారు. సమస్యలు ఎదురైతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పనులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు.
ప్రజాదర్బార్ సందర్భంగా స్వీకరించిన దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా దరఖాస్తుల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు. దరఖాస్తుల పరిష్కారానికి నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో పూర్తిగా భూ రీసర్వే ప్రక్రియ పూర్తిచేసి రాష్ట్రానికి ఆదర్శంగా రూపుదిద్దాలన్నారు. సమీక్ష లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఆర్డీఓ ఎన్.శ్రీనివాస్, ఆర్.అండ్. బి ఎస్ఈ యుగంధర్ రావు, పీఆర్ ఎస్ఈ వెంకటరెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

