భద్రాచలంలో 14నుంచి మూడురోజుల మెగా ఆధార్ క్యాంపు
సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 13)
ఆధార్ వివరాల్లో సవరణల కోసం జూలై 14, 15, 16 తేదీల్లో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెగా ఆధార్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్యాంపులో భద్రాచలం, బూర్గంపాడు దుమ్ముగూడెం, చర్ల మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ ఆధార్ కార్డులలో పేరులో తప్పులు, పుట్టినతేది, చిరునామా, లింగం, ఫొటో, మొబైల్ నెంబర్, ఐరిస్, ఫింగర్ప్రింట్ వంటి బయోమెట్రిక్ వివరాల్లో సవరణలు చేయించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఆధార్ నమోదు చేయించుకోని పిల్లలు, వృద్ధులు, ఇతర వర్గాలకు చెందిన వారు ఈ అవకాశం ఉపయోగించుకొని ఆధార్ నమోదు చేసుకోవచ్చని సూచించారు. తమ ఆధార్ వివరాలలో సవరణలు చేయించుకోవాలనుకునేవారు అందుకు సంబంధిత నిర్దేశించిన ధ్రువపత్రాలను ఆధారాలుగా తప్పకుండా వెంట తీసుకు రావాలని సూచించారు. ఈ క్యాంపులో
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించామని, క్యూలైన్, కౌంటర్లు, సహాయక బృందాలతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఆయా మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆధార్ సమాచారం సరిచేసుకోవాలని కలెక్టర్ జి.వి.పాటిల్ విజ్ఞప్తి చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

