Divitimedia
Bhadradri KothagudemLife StyleNational NewsSpot NewsTelangana

వరద పరిస్థితులపై అప్రమత్తమైన జిల్లాకలెక్టర్, ఎస్పీ

వరద పరిస్థితులపై అప్రమత్తమైన జిల్లాకలెక్టర్, ఎస్పీ

అధికార యంత్రాంగానికి మంత్రి పొంగులేటి ఆదేశాలు

✍️ భద్రాచలం – దివిటీ (ఆగస్టు 20)

గోదావరిలో వరద నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు క్షేత్రస్థాయిలో తిరిగి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. భద్రాచలం వద్ద 1వ ప్రమాద హెచ్చరిక ఉదయమే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇద్దరూ స్వయంగా రంగంలోకి దిగి దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రోడ్డు డైవర్షన్ పాయింట్ తనిఖీచేసి, భద్రాచలంలో కరకట్ట వద్ద పరిశీలించారు. వరద పరిస్థితుల్లో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాల రక్షణలో ఎలాంటి లోటు జరగకూడదని స్పష్టం చేశారు. జిల్లాకలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆరోగ్యం, తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. నదీ పరివాహక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందే సమాచారం అందించడం, అవసరమైతే వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయకబృందాలు సిద్ధంగా ఉండాలని, గ్రామ స్థాయిలో పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. “ప్రతి గ్రామంలో పరిస్థితిని నిమిషానికోసారి పరిశీలించాలి. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబడదు” అని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని, నదీ తీరప్రాంతాలకు వెళ్ల రాదని, వరద నీటిలో ప్రయాణాలు చేయ వద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా ఉంచాలని, జిల్లా
అధికారులు జారీచేసే సూచనలు తప్పని సరిగా పాటించాలని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. “ప్రభుత్వం మీతోనే ఉంది… ప్రతి ప్రాణం మాకు అమూల్యం… ప్రజల రక్షణ మా తొలి కర్తవ్యం… ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం మీతో ఉంది…” అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు.
భద్రాచలంలో పరిస్థితులు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలంతా అధికారులకు సహకరించాలని, ఏదైనా
అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయాలని కోరారు. ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతుందని తెలిపారు. తూరుబాక వద్ద రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పాయింట్ తనిఖీ చేసి, ఒకవేళ గోదావరి ఉద్ధృతి మరింతగా పెరిగినట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రాచలం వద్ద కరకట్టపై నుండి గోదావరి వరద ఉద్ధృతి పరిశీలించి, పట్టణవాసులతోపాటు నది పరిసర లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లే విధంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. విధుల్లో ఉన్న NDRF, DDRF బృందాల అధికారులకు కూడా పలు సూచనలు చేశారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇతర శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.

Related posts

ఏజెన్సీ ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలి : ఐటీడీఏ పీఓ

Divitimedia

వరంగల్- ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల

Divitimedia

ఐసీడీఎస్ పనితీరు గాడిలో పడేదెన్నడో…?

Divitimedia

Leave a Comment