భారత్ లేబర్ ప్రజా పార్టీ రద్దుకు ప్రతిపాదన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ వెల్లడి
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 20)
ఎన్నికల్లో పోటీలో లేని రాజకీయ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి భారత్ లేబర్ ప్రజా పార్టీని తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ లేబర్ ప్రజా పార్టీ గత ఆరు సంవత్సరాలుగా జరిగిన లోక్సభ ఎన్నికలలో గానీ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గానీ, ఉప ఎన్నికలలో గానీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టలేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం –1951లోని సెక్షన్ 29A ప్రకారం ఆ పార్టీ విధివిధానాలు అమలు చేయకపోవడం స్పష్టమైందని కలెక్టర్ వివరించారు.
ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం– 1951 లోని సెక్షన్ 29A క్రింద ఎన్నికల కమిషన్ తన అధికారాలను వినియోగించుకుంటూ, పై పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగించేందుకు ప్రతిపాదన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాతినిధ్యం ఏమైనా ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు గానీ ప్రధాన కార్యదర్శి గానీ ఈనెల 25వ తేదీ లోగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి అఫిడవిట్ సమర్పించాలని సూచించారు. ఈనెల 29వ తేదీన దీనిపై విచారణ నిర్వహించనున్నందున పార్టీ అధ్యక్షుడు గానీ ప్రధాన కార్యదర్శి గానీ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ఎలాంటి సమాధానం రాక పోతే, ఆ పార్టీ తరపున ఏ అభ్యంతరం లేనట్లుగా పరిగణించి, ఎన్నికల కమిషన్ రద్దు ఉత్తర్వులు జారీ చేస్తుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

