ఇంకుడుగుంత తవ్విన కలెక్టర్

ఇంకుడుగుంతల్లో జిల్లా అగ్రస్థానంలో ఉండాలన్న కలెక్టర్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 12)
‘జల సంచయ్ జన్ భగీదారి (క్యాచ్ ద రైన్)’ అమలులో దేశంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ అన్నారు. బుధవారం కొత్తగూడెం హమాలీ కాలనీలో కలెక్టర్ స్వయంగా ఇంకుడుగుంతల నిర్మాణానికి పట్టే సమయం, నిర్మాణం తీరుతెన్నులు పరిశీలించారు. జిల్లాకలెక్టర్ స్వయంగా స్థానిక యువకులతో మమేకమై, వారితో కలిసి ఇంకుడుగుంతల నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా భూగర్భజలాలు అభివృద్ధి పరచడానికి ఇంకుడుగుంతల ఆవశ్యకతను కలెక్టర్ ఆ యువకులకు వివరించారు. క్యూబిక్ మీటర్ ఇంకుడు గుంత తవ్వకానికి గంటన్నర సమయం మాత్రమే పట్టిందని, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, భవిష్యత్తు కాలంలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి నీటి బొట్టు వృథా కాకుండా ఇంకుడుగుంతలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సంబంధిత అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.