ఐసీడీఎస్ లో ‘దివిటీ మీడియా’ ప్రకంపనలు
‘డెప్యుటేషన్లు’ నిలిపివేస్తున్నట్లు తెలిపిన జేడీ సునంద
వసూళ్లపైనా విచారణ చేస్తామని స్పష్టం చేసిన జేడీ
✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ (సెప్టెంబరు 3)
ఐసీడీఎస్ లో ‘డెప్యుటేషన్ల’ పేరుతో సాగుతున్న దందా గురించి “దివిటీ మీడియా” ప్రచురించిన సమగ్ర కథనం ప్రకంపనలు సృష్టించింది. ఓ రీజనల్ అధికారి చేస్తున్న ఈ దందా గురించి ఆగస్టు 25వ తేదీన “ఐసీడీఎస్ లో అధికారుల అడ్డగోలు దోపిడీ” శీర్షికతో ‘దివిటీ మీడియా’ లో ప్రచురితమైన కథనంపై మహిళా, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖలో ఇటీవల బదిలీల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ‘డెప్యుటేషన్ల’ వ్యవహారానికి తెర లేచింది. బదిలీల్లో 40శాతం నిబంధన కారణంగా తమ తమ స్వస్థలాలకు దగ్గరగా వెళ్లాలనుకుని ఆశ పడిన అనేకమంది నిరాశకు లోనయ్యారు. ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకుని ‘పైరవీలకు’ తెరతీసిన ఓ అధికారి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల పేరు చెప్పి ఓ రేంజ్ లో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితులపై “దివిటీ మీడియా”లో సమగ్రమైన ఓ కథనం ప్రచురించడంతో అలజడికి దారి తీసింది. మరికొన్ని మీడియా సంస్థలు కూడా ‘దివిటీ మీడియా’ కథనాన్ని “కాపీ కొట్టి” మరీ ఇదే అంశాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో అసలు సమస్యలపై మూలాలను వెలికితీసేందుకు దివిటీ మీడియా, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ సునంద దృష్టికి సోమవారం ఈ అంశాలను తీసుకెళ్లగా, ఆమె స్పందించారు. వసూళ్ల ఆరోపణల నేపథ్యంలో అసలు ‘డెప్యుటేషన్ల’ జోలికే వెళ్లబోమంటూ స్పష్టం చేశారు. ఆ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపైనా విచారణ జరిపించి, బాధ్యులపై తగిన చర్యలు కూడా తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.