మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండురోజుల జైలుశిక్ష
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
మద్యం సేవించి వాహనం నడుపుతూ, పోలీసుల తనిఖీలలో పట్టుబడిన ఒక వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధించిన ఉదంతమిది… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై జి.ప్రవీణ్ కుమార్ పేర్కొన్న వివరాల ప్రకారం… జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఇల్లందుకు చెందిన ఆటోడ్రైవర్ టి.మధుకుమార్ ను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని
కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు లో హాజరుపరిచారు. కేసును మేజిస్ట్రేట్ బి.రవికుమార్ విచారించి, నిందితుడికి రెండురోజుల సాధారణ జైలుశిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ప్రజలు మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఆ వాహనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉందని తెలిపారు. మద్యం సేవించిన వారు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని ప్రజలకు సూచించారు.

