గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధతపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలోని పుష్కర ఘాట్ల వద్ద భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, చెక్ పోస్టుల ఏర్పాటు తదితర అంశాలపై ఆయన అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. భక్తులరద్దీ దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో బందోబస్తు కోసం ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ఘాట్ల వద్ద నిరంతరాయ నిఘా ఏర్పాటు చేసి, భక్తులకు ఎక్కడా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన రహదారులు, పుష్కరాలకు వచ్చే మార్గాల్లో అవసరమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పర్యవేక్షించాలని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, వాహనాల పార్కింగ్ కోసం కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రమాదాలు జరుగకుండా పుష్కరఘాట్ల వద్ద భద్రతాచర్యలు పటిష్ఠం చేయాలని, రిస్క్ ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. పుష్కరాల సమయంలో అన్నిశాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

