భద్రాచలంలో ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శుక్రవారం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వాహనాలు తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి అక్కడికక్కడే కొత్తనెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించారు. రోడ్డుభద్రత ప్రజలప్రాణాల రక్షణలో భాగంగా ప్రత్యేకంగా ఈ వాహన తనిఖీలు నిర్వహించినట్లు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్లు లేకుండానే నడుపుతున్నవి, నెంబర్లు సక్రమంగా లేని మొత్తం 44 వాహనాలను గుర్తించి, ఆ వాహనదారుల సమక్షంలోనే వాటికి కొత్త నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేశారు. ఈ తనిఖీలలో వాహనాలపై ఉన్న పెండింగ్ జరిమానాలు రూ.15,475 కట్టించారు.
ఈ సందర్భంగా వాహనదారులకు పలు రోడ్డు భద్రతా సూచనలు చేశారు. ప్రతి వాహనానికి నిబంధనల ప్రకారం సరైన నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని, నెంబర్ ప్లేట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడం వంటివి చేయరాదని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని తెలిపారు. అధిక వేగంతో, నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. మైనర్ బాలలకు వాహనాలివ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని సూచించారు. అన్ని ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్క వాహనదారుడి బాధ్యతని, రోడ్డు భద్రత, ప్రజల ప్రాణాల రక్షణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఇలా ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ తెలిపారు.

