అడుగడుగునా అవకతవకలమయంగా ఈజీఎస్

బూర్గంపాడు సోషల్ ఆడిట్లో వెల్లడైన వాస్తవాలు
ఈజీఎస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఉన్నతాధికారుల ‘క్లాస్’
✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 22)
ఉపాధి దొరకక జీవనం కష్టంగా మారిన పరిస్థితుల్లో పేదకూలీలకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేక అవకతవకలమయంగా మారింది. ఈ దుస్థితిని వెల్లడించేందుకు సాక్షాత్తూ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో నిర్వహించిన ‘సోషల్ ఆడిట్’ వేదికైంది. బూర్గంపాడు మండలంలోని 18గ్రామ పంచాయతీల పరిధిలో గతేడాది (2023-24) జరిగిన ఉపాధిహామీ పనులపై 10రోజులపాటు నిర్వహించిన సోషల్ ఆడిట్లో పలు రకాల అవకతవకలు, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మండలంలో పలు గ్రామ పంచాయతీల్లో చోటుచేసుకున్న అనేక అవకతవకలను బూర్గంపాడు మండల పరిషత్తులో శనివారం జరిగిన ‘బహిరంగ చర్చావేదిక (ఓపెన్ ఫోరం)’లో సోషల్ ఆడిట్ బృందం, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో వెల్లడించారు. ఈ బహిరంగ చర్చావేదికకు కూలీలను తీసుకువచ్చే బాధ్యత కలిగిన ఉపాధిహామీ పథకం సిబ్బంది, ఆ పని కూడా చేయకపోవడం గమనార్హం. కూలీలు లేకుండానే కేవలం అధికారులు, ఈజీఎస్ సిబ్బంది, సోషల్ ఆడిట్ సిబ్బందితో ‘సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరం’ కానిచ్చేశారు. గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా సోషల్ ఆడిట్ నామ మాత్రంగా చేశారనే ఆరోపణలుండగా అందులోనూ పలు సాంకేతిక పరమైన అవకతవకలు, తప్పులు బయటపడటం గమనార్హం. మండలంలో రూ.6.49 కోట్ల ఖర్చుతో చేసిన మొత్తం 584 పనులలో భారీగానే అవకతవకలు, అక్రమాలను గుర్తించారు.
————————
గ్రామసభ తీర్మానం కూడా లేకుండా పనులు చేయడం, మస్టర్ రోల్స్ లోనూ మాయాజాలం….
————————
మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ‘గ్రామసభ’ తీర్మానం లేకుండానే పనులు చేసినట్లు పలు ఉదంతాలు బయట పడ్డాయి. ఈ పథకంలో తీర్మానం చేసిన తర్వాత మాత్రమే పనులు చేయాలనేది కనీస ప్రాథమిక నిబంధన. తీర్మానాలను కేవలం కాగితాలపై రాసుకుని అవసరం బట్టి చూపిస్తున్నారనే విషయం వెలుగు చూసింది. ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించిన 5రకాల రిజిస్టర్లు ఎప్పటి కప్పుడు అప్ డేట్ చేస్తూ నిర్వహించాల్సి ఉండగా, నామమాత్రంగా ఒకటి రెండు మాత్రమే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పనులు జరుగుతున్న ప్రదేశాలలో పనిని ప్రారంభించక ముందు ఒకసారి ఫొటో, పని చేస్తున్నప్పుడు మరొకటి, పని పూర్తి చేసిన తర్వాత ఇంకొకటి ఫొటోలు తీసి ఫైల్ చేయాల్సి ఉంటుందనేది ప్రభుత్వం పెట్టిన నిబంధన. దీనివల్ల పనులు ఎలా జరుగుతున్నాయో? తెలుసుకునే వీలు కలుగుతుందనే ఉద్ధేశ్యంతో ఈ నిబంధన అములులోకి తెచ్చారు. కానీ సిబ్బంది కేవలం పనిచేస్తున్నప్పుడు ఓ ఫొటో తీసి పారదర్శకతకు పాతరేస్తున్నట్లు సోషల్ ఆడిట్ బృందం గుర్తించింది. దీనికితోడు సంతకాలు చేయని మస్టర్లతో మాయ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మస్టర్లలో దిద్దుబాట్లు, కొట్టి వేతలు, ఘోరమైన తప్పులున్నాయని గుర్తించారు. దీనినిబట్టి చూస్తే కూలీలు హాజరు కాకుండానే హాజరు వేస్తూ, పని చేసిందానికంటే అధికంగా కొలతలు తీసి కూలీలతో కుమ్మక్కైన సిబ్బంది తీవ్రమైన అక్రమాలకు పాల్పడుతున్నారని సోషల్ ఆడిట్ లో తేలింది. మరీ ముఖ్యంగా ఈ మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో నర్సరీల నిర్వహణలో ఘోరమైన తప్పు జరుగుతోందని తేలింది. సగటున ఒక్కో పంచాయతీలో పెంచిన 11,000 నుంచి 20,000 మొక్కలు ఎవరికి పంచారనేది, ఎక్కడ నాటారనేది, వాటిలో ఎన్ని బతికి ఉన్నాయి? ఎన్ని చనిపోయాయి? అనే వివరాలు లేవని వెల్లడైంది. దీనికితోడు క్షేత్రస్థాయిలో మొక్కలు కూడా ఎక్కడా కనిపించిన దాఖలాలే లేవు. సగటున ఒక గ్రామ పంచాయతీలో రూ.3లక్షలకు పైగానే ఖర్చుచేస్తూ పెంచినట్లు చెప్తున్న మొక్కలకు లెక్కలే తేలడం లేదు. అంటే ఒక్క ఈ మండలంలోనే మొక్కలు పెంచే పేరుతో ఖర్చుచేసిన రూ.54 లక్షల పైగా నిధుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు తేల్చారు. ప్రతినెలా నిర్వహించాల్సిన ‘రోజ్ గార్ మేళా’ కూడా అనేక గ్రామాల్లో నిర్వహించడం లేదని, కూలీల హాజరు లేకుండానే పనులు ఎంపిక చేసి, గ్రామ సభ నిర్వహణకు సంబంధించిన నిధులు ఖర్చు రాసేస్తున్నారని సోషల్ ఆడిట్ లో వెల్లడైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పనులపై అధికారుల పర్యవేక్షణ కూడా లేదని తేలింది. పనులు తనిఖీలు చేసిన సందర్భంలో సంబంధిత అధికారులు మస్టర్ రోల్స్, ఇతర రికార్డుల్లో తప్పకుండా చేయాల్సిన సంతకాలు లేక పోవడమే దీనికి నిదర్శనంగా తేల్చారు. గతంలో నిర్వహించిన సోషల్ ఆడిట్ లో వెలుగుచూసిన అవకతవకలు, అక్రమాలపై సరైన చర్యలు లేకపోవడం వల్లనే సిబ్బందిలో జవాబుదారీతనం లేక ఇంకా అక్రమాలకు పాల్పడుతున్నారనేది స్పష్టమవుతోంది. ప్రస్తుత సోషల్ ఆడిట్లో గుర్తించిన అవకతవకలు, అక్రమాలపైన కఠినచర్యలు తీసుకుని, మున్ముందు మరిన్ని అక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.