ఎన్నికల ప్రక్రియపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓ
✍🏽 దివిటీ మీడియా – మణుగూరు
పినపాక నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో సెప్టెంబర్ 19 లోపు ఓటు నమోదు, తొలగింపు, బదిలీ, సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంకఅల సూచించారు. మణుగూరులో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఐటీడీఏ పీఓ ప్రతిక్ జైన్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తో కలిసి ఆమె శనివారం పినపాక (ఎస్టీ) నియోజకవర్గం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ పై, ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్ లో వసతి సౌకర్యాలు అన్నీ, ముఖ్యంగా విద్యుత్తు, మంచినీరు దివ్యాంగ ఓటర్ల కోసం ర్యాంప్ ల ఏర్పాట్లు, తదితర సౌకర్యాలు సరిగా ఉన్నాయో, లేవో అనేది పరిశీలించి నివేదికలందజేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఈ నెల (సెప్టెంబర్) 19 లోపు తప్పనిసరిగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరుగా నమోదు, తొలగింపు, బదిలీ సవరణలకు దరఖాస్తు చేసుకునే విధంగా సంబంధిత బీఎల్వోలు చూడాలని కూడా ఆదేశించారు. ఆ విధంగా వచ్చిన క్లెయింలనూ ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. సమీక్షలో భద్రాచలం ఆర్డీఓ మంగీలాల్, ఏఈఆర్ఓ, మణుగూరు తహశీల్దార్ రాఘవరెడ్డి ,ఆర్ఐ లు, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

