భద్రాద్రి కొత్తగూడెంలో ఈ నెల 7నుంచి జాతీయ కబడ్డీ పోటీలు
69 వ జాతీయ కబడ్డి పోటీలకు 33 జట్ల రిజిస్ట్రేషన్ పూర్తి
వెల్లడించిన జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ *************************
✍️ దివిటీ మీడియా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల జాతీయస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు వేదికైంది. ఈ పాఠశాల ఆవరణలో స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 69వ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు జనవరి 7వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయని జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయస్థాయి క్రీడాపోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల, జాతీయ స్థాయి విద్యాసంస్థల నుంచి భారీగా స్పందన లభించిందని ఆయన తెలిపారు. అండర్–17 బాలుర విభాగంలో నిర్వహించబడనున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు మొత్తం 33 జట్లు రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం, ఒడిశా, పశ్చిమబెంగాల్, మణిపూర్, త్రిపుర, గుజరాత్, ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతోపాటు దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయని వివరించారు. వీటితోపాటు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(KVS), నవోదయ విద్యాలయ సమితి(NVS), సీబీఎస్ఈ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, సీఐఎస్సీఈ (ICSE), విద్యాభారతి వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల జట్లు కూడా ఈ పోటీల్లో పాల్గొని తమలోని క్రీడాప్రతిభను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రతి జట్టు నుంచి 6నుంచి 12మంది క్రీడాకారులతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు.జాతీయస్థాయి కబడ్డీపోటీల నిర్వహణ వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందనుందని కలెక్టర్ తెలిపారు. క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వసతి, భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత, రవాణా ఏర్పాట్లు తదితర అంశాలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ఈ జాతీయ క్రీడాపోటీలను విజయవంతంగా నిర్వహించి జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో మరింత పెంచేలా సంబంధిత శాఖలు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ సూచించారు.

