రక్తదానం చేసి జీవితాలు కాపాడండి : కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 15)
రక్తదానం చేయడాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేయడం ద్వారా జీవితాలు కాపాడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నేతృత్వంలో జిల్లా రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని రైల్వేస్టేషన్ ఆవరణంలో రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా ఉచిత రక్తపరీక్ష శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ఈ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తపరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రజలు తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం సులభతరమవుతుందన్నారు. తద్వారా ఏదేని అత్యవసర సందర్భాల్లో రక్తదానం చేసేందుకు సులభంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా యువత రక్తదానం చేయడం ఆదర్శంగా తీసుకుని ఆపత్కాలంలో రక్తదానం చేసి జీవితాలు నిలబెట్టాలని కోరారు. రక్తపరీక్ష చేయించుకుని తాను కూడా అత్యవసర సమయంలో రక్తం దానం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టర్ తెలిపారు. తమ తమ బ్లడ్ గ్రూప్ పట్ల అవగాహన ఉండటం వల్ల స్వీయ సంరక్షణకు కూడా ఉపయోగమన్నారు. ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో జరిగిన ఈ
కార్యక్రమంలో ఆర్టీఓలు వెంకటరమణ, మనోహర్, వెంకటపుల్లయ్య, డీఎస్పీ రెహమాన్, ట్రాఫిక్ ఎస్ఐ నరేష్, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు పాల్గొన్నారు.


