వనమహోత్సవ లక్ష్యాలు సాధించాలి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన

✍️ లక్ష్మీదేవిపల్లి – దివిటీ (జులై 11)
వనమహోత్సవ లక్ష్యాలు సాధించాలని, అందరూ తమ వంతు సహకరించాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన కోరారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. మైలవరం గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ అనేది అందరి బాధ్యతని పిలుపునిచ్చారు. ఆ తర్వాత అదే గ్రామంలో లక్ష్మీనర్సు అనే రైతుకు చెందిన మునగ మొక్క నాటి ప్రారంభం చేశారు. మైలారం గ్రామంలోని జడ్పీ ఎస్ఎస్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మునగ, వెలగ, ఉసిరి మొక్కలు నాటి విద్యార్థుల్లో పర్యావరణంపై, ఔషధ మొక్కలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆ పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన “కమ్యూనిటీ మ్యాజిక్ సోక్ పిట్” ను పరిశీలించి, శుభ్రత పట్ల అవగాహన కల్పించేందుకు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అంగన్వాడీ కేంద్రం సందర్శించి చిన్నారులకు అందుతున్న పోషకాహారం, వృద్ధి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మైలారం గ్రామపంచాయతీలోని నర్సరీ, గట్టుమల్ల నర్సరీలను సందర్శించిన ఆమె మొక్కల లభ్యత పరిశీలించారు. ఆ నర్సరీల్లో వివిధ రకాల మొక్కల సంఖ్య, పంపిణీ విధానాలు, మొక్కల ఆరోగ్యం తదితర అంశాలు సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమాల్లో మండల అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

