‘రాజీవ్ యువవికాసం’ కార్యక్రమం ప్రారంభించిన సీఎం



✍️ హైదరాబాద్ – దివిటీ (మార్చి 17)
రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచనతో రూ.6వేల కోట్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “రాజీవ్ యువవికాసం” కార్యక్రమం చేపట్టిందని సీఎం ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. స్వయంఉపాధి కల్పనలో అసలైన, అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ పథకంతో ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేసిన సీఎం, జూన్2 వ తేదీన 5 లక్షల మంది లబ్దిదారులను ప్రకటిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఆర్థికసాయం అందించడానికుద్దేశించిన ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమాన్ని శాసనసభ ప్రాంగణంలో డెప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ముఖ్యమంత్రి ఈ పథకం ప్రారంభించారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, పథకం ప్రధాన ఉద్దేశాలను విడమరిచి చెప్పారు. “నైపుణ్యం ఉండీ ఉద్యోగం లభించని యువతకు ఈ పథకం కింద ప్రాధాన్యత కల్పించాలని, పారదర్శకంగా ఉండాలని, అర్హులు, నిజమైన నిరుద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకుద్దేశించిన ఈ పథకాన్ని మున్ముందు మరింత పటిష్టంగా అమలు చేస్తామన్నారు. అర్హులైన యువతీ యువకులను ఎంపిక చేసేందుకు ప్రజాప్రతినిధులు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 4 నుంచి 5 వేల మందికి ఉపాధి కల్పించవచ్చని ఆయన వివరించారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వారికి రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకు సహాయం అందించవచ్చని వెల్లడించారు. ఇవ్వగలిగిన ఉద్యోగాలు ఇస్తున్నామని, అవకాశాలున్నంతవరకు ఉపాధి కల్పిస్తున్నామని, నేర్పించాల్సిన చోట వృత్తి నైపుణ్య శిక్షణనిస్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్రంలో 57వేలకు పైగా ఉద్యోగాలు చిన్న పొరపాటు కూడా లేకుండా పారదర్శకంగా భర్తీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో 22వేలమంది టీచర్ల ప్రమోషన్లు, 30వేల టీచర్లబదిలీల్లో చిన్న ఆరోపణ కూడా రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి జరగని బదిలీల ప్రక్రియను పూర్తిచేశామన్నారు. రాష్ట్రంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని, గతంలో నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా విధానం ఉండేదన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి పలికి స్పష్టమైన, విధానపరమైన నిర్ణయాలతో పరిపాలనను ప్రక్షాళన చేస్తూ ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నామని సీఎం వివరించారు.