జాతీయ రహదారుల నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలి
ఉన్నత స్థాయి అధికారుల సమీక్షలో మంత్రి తుమ్మల
✍️ ఖమ్మం – దివిటీ (ఆగస్టు 6)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం ఆయన రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణాల మంజూరు, ప్రగతి తీరుపై సమీక్షించారు. హైద్రాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఖమ్మం నుంచి సూర్యాపేట ఎంట్రీ వద్ధ ఫ్లైఓవర్ నిర్మాణపనులు సత్వరమే ప్రారంబించాలని సూచించారు. ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల ప్రగతి, ఖమ్మం – దేవరపల్లి రహదారిలో ధంసలాపురం వద్ద ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల కోసం అయ్యే భూసేకరణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, దానికి అనుగుణంగా జాతీయ రహదారుల అథారిటీకి లేఖ రాయాలన్నారు. ఈ మేరకు వెంటనే పనులు ప్రారంభమయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ధంసలాపూరం ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ల నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే వెంబడి నూతన కలెక్టరేట్ వరకు సర్వీస్ రోడ్లను కూడా పూర్తి చేస్తీ ఖమ్మంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం మరింత ఉపకరిస్తుందని తెలిపారు. ఈ ప్రాధాన్యతను బట్టి సర్వీస్ రోడ్లను సత్వరమే మంజూరుచేయాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఖమ్మం – కురవి రోడ్డు, ఖమ్మం – కోదాడ రోడ్డు పురోగతిపై సమీక్ష చేశారు. నెహ్రూనగర్ – కొత్తగూడం జాతీయ రహదారి, టెండర్ల దశలో ఉందని, టెండర్ పూర్తికాగానే నిర్మాణ పనులు మొదలు పెడతామని హరిచందన తెలియ జేశారు. చిల్లకల్లు (హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారి) క్రాస్ రోడ్డు నుంచి బోనకల్లు, వైరా, తల్లాడ నుంచి కొత్తగూడం వరకు జాతీయరహదారి మంజూరు కోసం కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, త్వరలోనే మంజూరవుతుందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల తెలియజేశారు.