యువతను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఎన్సీసీ పాత్ర కీలకం
ఎన్సీసీ యూనిట్లకు శిక్షణ సామగ్రి పంపిణీచేసిన కలెక్టర్
✍️ దివిటీ మీడియా (భద్రాద్రి కొత్తగూడెం)
యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించి, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎస్ఆర్ నిధుల ద్వారా ఎసెన్షియా అడ్వాన్స్ఢ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జిల్లాలోని 25 ఎన్సీసీ యూనిట్లకు అందించిన రూ.9 లక్షల విలువైన శిక్షణ సామగ్రిని కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్సీసీ విద్యార్థుల్లో క్రమ శిక్షణ, ఆత్మవిశ్వాసం, సమయపాలన, నాయకత్వ నైపుణ్యాలు, జాతీయ సమైక్యత, సేవాభావం వంటి విలువలు పెంపొందిస్తుందన్నారు. వ్యక్తిత్వవికాసం, శారీరక దృఢత్వం, సామాజిక బాధ్యత, దేశసేవ పట్ల అంకితభావం పెంపొందించే దిశగా ఎన్సీసీ శిక్షణ దోహదపడుతుంది అన్నారు. ఎన్సీసీలో తీర్చిదిద్దబడిన యువత భవిష్యత్తులో వివిధ రంగాల్లో రాణించడంతోపాటు దేశాభివృద్ధిలో భాగ స్వాములు కావాలని ఆకాంక్షించారు.ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు ఎప్పుడూ ముందుండి సేవలందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో సహకరించడం అభినందనీయమని కలెక్టర్ చెప్పారు. ఈ సామగ్రి ఎన్సీసీ క్యాడెట్ల శిక్షణ ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి శిక్షణా శిబిరాలు, రిపబ్లిక్ డే క్యాంపులు, ఇతర పోటీల్లో వారు మరింత ప్రతిభ కనబర్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 25 ఎన్సీసీ యూనిట్లకు 190 డమ్మీ గన్స్, 130 కంపాస్లు, 130 సర్వీస్ ప్రొట్రాక్టర్లు, 190 ఎన్సీసీ హ్యాండ్బుక్స్, 100 పోటీ పరీక్షల పుస్తకాలను జిల్లాకలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి, 11 తెలంగాణ బెటాలియన్కు చెందిన ఎన్సీసీ అధికారులు, జిల్లాలోని 25 ఎన్సీసీ యూనిట్ల అసోసియేట్ అధికారులు (ఏఎన్ఓలు), 120 మంది ఎన్సీసీ క్యాడెట్లు, 7 డిగ్రీ కళాశాలలు, 18 పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

