భార్యను నరికి చంపి తిరుపతి వెళ్లబోయాడు
✍️ బెంగళూరు – దివిటీ (జూన్ 27)
చిన్న చిన్న కారణాలకే కట్టుకున్న వారిని, కన్నవారిని, ప్రేమించిన వారిని చంపడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. కర్నాటక రాష్ట్రంలో తాజాగా జరిగిన అలాంటి ఓ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
కర్నాటక రాష్ట్రంలోని రామనగర జిల్లా మాగడి ప్రాంత మత్తికెరెలో రంగయ్య (68), తిమ్మమ్మ(65) అనే దంపతులు నివసిస్తున్నారు. బుధవారం రాత్రి భార్యా భర్తల మధ్య కూర విషయంలో గొడవ జరిగింది. కూర బాగా చేయలేదనేదానిపై జరిగిన ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ సంఘటనలో రంగయ్య కొబ్బరి తురిమే పీటతో భార్యను నరికేశాడు. ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా గురువారం ఉదయం తిరుపతికి వెళ్లేందుకు బయలు దేరాడు. దీనిపై స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు భర్తను రామనగర ప్రాంతంలో అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రంగయ్యను రిమాండుకు తరలించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

