తెలంగాణలో ఉన్నతాధికారిపై కొరడా ఝులిపించిన ఎలక్షన్ కమిషన్
తెలంగాణ టూరిజం ఎండీ బోయినపల్లి మనోహర్ రావు సస్పెన్సన్
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మంత్రితో తిరుపతిలో పర్యటన
✍🏽 కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా
తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) ఉల్లంఘించినందుకు ఓ ఉన్నతాధికారిపై ఎన్నికల కమిషన్ కొరడా ఝులిపించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్టోబరు 9వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గతనెల(అక్టోబరు) 15, 16తేదీల్లో తిరుపతి వెళ్లారు. ఆయనతో కలిసి ఆ పర్యటనలో తెలంగాణ టూరిజం కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) బోయినపల్లి మనోహర్ రావు, ఆయన ఓఎస్డీగా పనిచేస్తున్న (రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్)వై.సత్యనారాయణ కూడా ఉన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉండగా, ఉల్లంఘించి మంత్రితో పర్యటించినందుకు బోయినపల్లి మనోహర్ రావును సస్పెండ్ చేసిన ఎన్నికల కమిషన్ శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆయనతోపాటు ఆ పర్యటనలో పాల్గొన్న ఓఎస్డీ వై సత్యనారాయణను తొలగిస్తూ, ఆయనకు సంబంధించిన నియామకపు ఉత్తర్వులు రద్దు చేసింది. ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ తెలంగాణ టూరిజంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ నుంచి వివరణ కోరింది. ఈ అంశంపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను నవంబరు 19వ తేదీ మధ్యాహ్నం 3గంటల్లోగా కమిషన్ కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Save or share this story as a newspaper-style Epaper Clip:

