సింగరేణి ప్రధానాసుపత్రిని తనిఖీచేసిన డీఎంహెచ్ఓ
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ బుధవారం తనిఖీచేశారు.అక్కడి ఆసుపత్రిలోని వివిధ విభాగాలు కలియ తిరిగి పరిశీలించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలు, వైద్యసిబ్బంది పనితీరు తదితర అంశాల గురించి ఆరాతీశారు. పిల్లల వార్డు, ప్రసూతి వార్డు, సర్జికల్ వార్డు, ఐసీయూ, పురుషుల వార్డు, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే విభాగం, ఇమ్యునైజేషన్ విభాగం, తదితర విభాగాలను సందర్శించి అక్కడ అందుతున్నసేవలు పరిశీలించారు. పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవల నాణ్యత, పారిశుద్ధ్యం, రోగులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై ఆయన అధికారులతో చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. అత్యవసర వైద్యసేవలు, ప్రసూతి, శిశువైద్యం, శస్త్రచికిత్సలు వంటి సేవల్లో నాణ్యత ప్రమాణాలు ఉండాలని సూచించారు. సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.కిరణ్ రాజ్ కుమార్ , ప్రోగ్రాం ఆఫీసర్ డా.ప్రతాప్, నాగభూషణం, రాంప్రసాద్ సహా, సింగరేణి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

