Divitimedia
Bhadradri KothagudemCrime NewsSpot NewsTelanganaYouth

మళ్లీ మొదలైన ఆటవిక వేట… మనిషి ప్రాణాలతో ఆట…

మళ్లీ మొదలైన ఆటవిక వేట… మనిషి ప్రాణాలతో ఆట…

✍️ దివిటీ మీడియా (పినపాక)

అడవిలో ప్రాణాలు తీసే మూగజీవాల వేట మళ్లీ మొదలైంది… జంతువులను వేటాడి వాటి మాంసం తినే ఈ వ్యసనం మళ్లీ నిద్రలేచింది… ఒకప్పుడు అటవీ పరిసర గ్రామాల్లో నిత్యకృత్యంగా ఉండే జంతువుల వేట క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. అడవి జంతువులను వేటాడేది నేరమనే విషయంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో ఈ అనాగరిక చర్య త్వరలో పూర్తిగా కనుమరుగవుతందనే ఆశలతో ఉన్న అధికారులు కాస్త రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం అడవి జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్తు ఉచ్చులో పడి ఏకంగా ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడంతో అటవీశాఖలో తీవ్రకలకలం రేపింది. గతంలో ఏజెన్సీలో దాదాపు అన్నిప్రాంతాల్లో జంతువులవేట నిత్యకృత్యంగా కొనసాగుతుండేది. ఈ ప్రాంతంలో పినపాక నియోజకవర్గంలోని అటవీ పరిసర గ్రామాల్లో వేటను వృత్తిగా చేసుకున్నవారు ప్రతిగ్రామంలో దాదాపు ఐదారుగురు ఉండేవారు. వారికితోడుగా మరికొంతమంది అడపాదడపా వేటకు వెళ్లేవారు. ఈ నేపథ్యంలో నక్సలైట్లకోసం అడవుల్లో కూంబింగ్ చేస్తున్న క్రమంలో పోలీసులు కూడా వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు ఉచ్చులకు బలైపోయిన పలు సంఘటనలు జరిగాయి. అడవిలో తమ పెంపుడు పశువులను మేపేందుకు వెళ్లి అనేకమంది రైతులు, పశువులకాపరులు మృత్యువాతపడిన సంఘటనలు చాలా జరిగాయి. బూర్గంపాడు మండలంలోని టేకులచెరువు, గోపాలపురం, నకిరిపేట, ఇరవెండి, మోతెపట్టీనగర్, కృష్ణసాగర్, తదితర గ్రామాలు అప్పట్లో జంతువుల వేటకు నిలయాలుగా ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకుని వేట కంట్రోల్ చేయగలిగారు. ఈ నేపథ్యంలో మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత మంగళవారం రాత్రి నకిరిపేటలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా అడవి జంతువులను వేటాడటం కోసం విద్యుత్ తీగలు అమర్చిన సమాచారంపై సిబ్బంది వెళ్లి ప్రమాదానికి గురికావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. డీఆర్వో కుర్సం అనార్కలి, బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ సిబ్బందితో వెళ్లినప్పుడు అక్కడ అమర్చి ఉన్న విద్యుత్ ఉచ్చు తగిలి నవీన్ దుర్మరణం పాలు కావడం అటవీశాఖలో తీవ్ర విషాదం నింపింది. ఈ సంఘటనతో అటవీశాఖలో సిబ్బంది భద్రతపైన మళ్లీ చర్చకు తెరలేచింది. అడవి జంతువుల చంపేందుకు విద్యుత్ వైరును అమర్చి, నవీన్ మరణానికి కారణమయ్యారంటూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేష్, తాటి వీరబాబు అనే నిందితులపై తగిన చర్యల కోసం డీఆర్ఓ అనార్కలి ఇచ్చిన ఫిర్యాదుతో బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)సతీష్ దర్యాప్తు చేపట్టారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పర్యవేక్షణ ‘గాలిలో వెలగని దీపం…’

Divitimedia

గృహలక్ష్మి పథకంలో అర్హులను మాత్రమే ఎంపిక చేయాలి

Divitimedia

రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు

Divitimedia

Leave a Comment