శివలింగాపురంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్


✍️ దివిటీ మీడియా (పినపాక)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు శివలింగాపురం ప్రాంతంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున పట్టణ పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వాహనాలు తనిఖీచేసి, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ప్రత్యేకదృష్టి సారించారు. 147 వాహనాలకు పెండింగ్ చలాన్ల ద్వారా మొత్తం రూ.35 వేలు వసూలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 13 స్పాట్ కేసులు నమోదు చేశారు. సరైన నెంబర్ ప్లేట్లు లేని 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న, నిల్వచేసిన రూ.35వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా శివలింగాపురం కాలనీవాసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటుచేసి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గుర్తుతెలియని వ్యక్తులనుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింక్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తూ, డ్రగ్స్కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతోపాటు వినియోగించేవారిపై కూడా కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డుభద్రత గురించి అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకుని తప్పక ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
నేరాల నియంత్రణలో భాగంగా కాలనీల్లో సొంతంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, కొత్త వ్యక్తులకు ఇళ్లను అద్దెకు ఇచ్చే సమయంలో వారి పూర్తి వివరాలు తెలుసుకుని, తగిన ధృవీకరణ చేసుకోవాలని ప్రజలకు సూచించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ప్రజలకేవైనా సమస్యలున్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నాగబాబు, ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సైలు, పోలీసు, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

