కారుడ్రైవరుకు ఏడాదిన్నర జైలుశిక్ష, రూ.5వేల జరిమానా
✍️ దివిటీ మీడియా
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి మహిళ మృతికి కారణమైన కారుడ్రైవరుకు ఏడాదిన్నర జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ మంగళవారం తీర్పునిచ్చారు. ఈ కేసులో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం పడమటినర్సాపురంలో2016 ఏప్రిల్ 21 రాత్రి చోటు చేసుకున్న సంఘటనపై బాధిత కుటుంబసభ్యుడు నాచబోయిన ప్రశాంత్ జూలూరుపాడు పోలీసుస్టేషన్లో 2016 ఏప్రిల్ 22న ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులు నాచబోయిన వెంకన్న, లలిత వారింట్లో నిద్రిస్తుండగా, పాల్వంచకు చెందిన నందిగామ పవన్ కుమార్ కారు అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి వారింట్లోకి పోనిచ్చాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన తన తల్లి నాచబోయిన లలిత అక్కడికక్కడే మరణించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు ముందు 100గజాల దూరంలో మాచినపేటకు చెందిన లాకావత్ సాయి కుమార్, బోడా అశోక్ కుమార్ అనేవారు ప్రయాణం చేస్తున్న మోటార్ సైకిల్ ను కూడా ఆ కారుతో ఢీకొట్టగా వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై అప్పటి హెడ్ కానిస్టేబుల్ కె.రామదాస్ కేసు నమోదు చేయగా, అప్పటి ఎస్సై పి.శ్రీనివాస్ దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో 14 మంది సాక్షులను విచారించిన అనంతరం ఆ కారును డ్రైవ్ చేసిన నందిగామ పవన్ కుమార్ కు ఏడాదిన్నర జైలుశిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కేసులో ఏపీపీ బి.విశ్వశాంతి ప్రాసిక్యూషన్ నిర్వహించగా కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై డి.రాఘవయ్య కోర్ట్ పీసీ ఉపేందర్ రావు సహకరించారు.

