ఇకనుంచి ప్రతి ఆదివారం గోదావరి నది హారతి
ప్రజల సూచనల మేరకు మార్చామన్న జిల్లాకలెక్టర్
✍️ దివిటీ మీడియా
‘ఏరు – ది రివర్ ఫెస్టివల్’లో భాగంగా భద్రాచలంలో శనివారం నిర్వహించేలా ప్రారంభించిన గోదావరినది హారతి కార్యక్రమం ప్రజల సూచనల మేరకు ఇక నుంచి ప్రతి ఆదివారం నిర్వహించాలని నిర్ణయించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నదీ హారతి కార్యక్రమం ప్రారంభమై రెండు విడతలు శనివారాల్లో కొనసాగింది. కార్యక్రమానికి సంబంధించి పలువురు ప్రజలు, భక్తులు, పండితుల నుంచి వచ్చిన సూచనలు, విన్నపాలు, సలహాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. గత శనివారం ముందుగానే ప్రకటించినట్లుగా ఈ వారం నుంచి ప్రతి ఆదివారం నది హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
గత రెండు శనివారాలలో భద్రాచలం గోదావరి ఘాట్ వద్ద నిర్వహించిన నది హారతి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. ప్రజల సౌకర్యం, స్థానిక సంప్రదాయాల పరిరక్షణ కోసం కార్యక్రమానికి మరింత విస్తృత భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో గోదావరినది హారతి ఇకపై ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గోదావరి నది ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, నది పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని గోదావరి నది సంరక్షణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

