కార్మికుల భీమా పెంపు పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
✍️ దివిటీ – కొత్తగూడెం (నవంబరు 24)
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన బీమా పెంపు వివరాలు ప్రజల్లో ప్రచారం చేయడంలో భాగంగా తయారు చేసిన పోస్టర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ సోమవారం ఐడీఓసీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల భద్రతను బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, అనుకోని మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించేలా ఇచ్చే బీమా మొత్తం పెంపు చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సమాజమరణానికి బీమా రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు, ప్రమాద మరణ బీమా రూ.6లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 16.50 లక్షల కార్మికులు లబ్ధి పొందనున్నారని వివరించారు. ఈ బీమా ప్రయోజనాలు ప్రతి కార్మికుడికి అందుబాటులో ఉండేందుకు కార్మికశాఖ, బీమాసంస్థలు, బోర్డులు సమన్వయంతో వేగంగా సేవలందించాలని అధికారులకు సూచించారు. భీమా క్లెయిమ్ విధానం, అవసరమైన పత్రాలు, అర్హతలు, టోల్ఫ్రీ నంబర్ల వంటి సమాచారం గ్రామ స్థాయి వరకు విస్తృతంగా చేరేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కార్మిక కుటుంబాలు ఏ కష్టకాలంలోనైనా ఆర్థికంగా కూలిపోకుండా రక్షించేందుకు బీమా పథకాలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ అధికారి షర్ఫుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

