Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleNational NewsSpot NewsTelanganaWELFARE

జిల్లా సమిష్టికృషి ఫలితమే జాతీయ అవార్డు

జిల్లా సమిష్టికృషి ఫలితమే జాతీయ అవార్డు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్

✍️ దివిటీ – కొత్తగూడెం (నవంబరు 24)

జిల్లా నీటిసంరక్షణలో సాధించిన విశిష్ట విజయాలకు గాను ప్రతిష్ఠాత్మక ‘జల్ సంచయ్–జన్ భాగీదారీ’ కేంద్ర ప్రభుత్వ అవార్డు, రూ.25లక్షల నగదుబహుమతి అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషి ఫలితమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జి.వి.పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డ్ మెంబర్ పృధ్విరాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నీటి సంరక్షణకు చేపట్టిన ప్రతి కార్యక్రమం అధికారుల నిబద్ధత, గ్రామ స్థాయి వర్గాల కృషితో విజయవంతమైందన్నారు. జిల్లా సాధించిన విజయాలు,గణాంకాలు జాతీయస్థాయి వేదికపై చూసినప్పుడు గర్వం కలుగుతోందన్నారు. తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతలు తవ్వడంపై పరిశీలనతో ఎంపీడీఓలు ప్రతిపాదించిన మోడల్‌ అమలులోకి తీసుకొచ్చామని, తర్వాత ఉపాధిహామీ కూలీలు, గ్రామ పంచాయతీవర్కర్లతో ప్రత్యక్షంగా పాల్గొని తవ్వకాల్లో ఎదురయ్యే సమస్యలు గుర్తించగలిగామని తెలిపారు. పంచాయతీ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశావర్కర్లతో ప్రారంభమై, ఉద్యమంలా అన్ని శాఖల సమన్వయంతో విస్తరించి, ఈ జిల్లాకు జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక అవార్డు అందించిందని చెప్పారు. అవార్డు లక్ష్యం కాదని, భూగర్భజలాల పరిరక్షణ, వ్యవసాయానికి నీటి అందుబాటును పెంచడం, వర్షపునీరు భూమిలో చేరేలా చేయడం అసలు ఉద్దేశ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.25లక్షల బహుమతిని కూలీలకు భారం తగ్గించే యంత్రపరికరాల కొనుగోళ్లకు వినియోగించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే తవ్విన ఇంకుడుగుంతలను శుభ్రపరిచే కార్యక్రమాలు ప్రారంభించాలని, బయోచార్, ఫారమ్ పాండ్ల నిర్మాణం, భూసారం కాపాడే పనులతో రైతులు అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ, వ్యవసాయ, పోలీస్, వైద్య, ఇరిగేషన్ తధితర శాఖల అధికారులకు కలెక్టర్ సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేసి సత్కరించారు.

Related posts

మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల

Divitimedia

మహిళగానైనా మంత్రి స్పందించి ఉంటే బాగుండేది

Divitimedia

పర్యవేక్షణ ‘గాలిలో వెలగని దీపం…’

Divitimedia

Leave a Comment