‘సబ్ స్టేషన్’ కు స్థలం త్వరగా చూడాలి
శాఖల వారీగా ‘ఆభివృద్ధి, సంక్షేమం’పై ఎమ్మెల్యే పాయం దృష్టి
✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 15
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టితో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మండలాలవారీగా సమీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సోమవారం బూర్గంపాడు మండలంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓవైపు అభివృద్ధి పనులను సాధ్యమైన స్థాయిలో ప్రభుత్వం నుంచి రాబట్టడం, మరోవైపు సంక్షేమ పథకాల అర్హులైన పేదలందరికీ చేర్చాలన్నదే తన లక్ష్యంగా ఎమ్మెల్యే పాయం పేర్కొన్నారు. మండల స్థాయి సమీక్షలో ఎమ్మెల్యే ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంపై ప్రత్యేకంగా వివరాలు సేకరించడం, ఇంకా మిగిలిపోయిన పనుల మంజూరు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించడంపై దృష్టి పెట్టారు. ఈ మేరకు బూర్గంపాడు మండలం ముసలిమడుగు గ్రామంలో ఏర్పాటుచేయాల్సిన విద్యుత్ సబ్ స్టేషన్ కోసం వెంటనే స్థలం ఎంపిక చేసి అప్పగించాలని ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ అధికారులను కోరారు. అర్హులైన పేదలందరికీ ‘ఉచిత విద్యుత్’ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. మండలంలో 11,204 కుటుంబాలకు ఉచిత విద్యుత్, 10305 కుటుంబాలకు రూ.500 వంట గ్యాస్ సబ్సిడీ అందిస్తున్నట్లు వివరాలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి మండలంలో 3,402 మంది అర్హులను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. ‘రైతుబంధు’ వస్తున్న రైతుల వివరాలడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, రైతులందరికీ పథకం అందించే విధంగా చూడాలని కోరారు. యూరియా కొరత ఏమైనా ఉందా? అన్న అంశంపై ఆరా తీసిన ఎమ్మెల్యే, డిమాండ్, సరఫరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో వరదల్లో పంటనష్టపోయిన రైతులకు సాయం అందిన వివరాలపైనా ఆరా తీశారు. ఇందిరమ్మ గృహనిర్మాణం పురోగతతిపై సమీక్షించారు. రహదారుల తీరుతెన్నులపై సమీక్షించి, మండలంలో అన్ని గ్రామాలకు రహదారురులుండేలా ప్రతిపాదనలు సమర్పించాలని ఐటీడీఏ, పంచాయతీరాజ్ ఇంజినీర్లను కోరారు. మరమ్మతులు అవసరమైన రహదారుల వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ వివరాలు, కల్యాణలక్ష్మి లబ్ధిదారుల వివరాలపైనా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్ష చేశారు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలకు భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు అందించాలని కోరారు. బూర్గంపాడులో సమీక్ష సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేకు పలువురు ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేయగా, సమస్యల పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

