అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు
కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో డీఎస్పీ చంద్రభాను
✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 18
అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ చంద్రభాను హెచ్చరించారు. గురువారం
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలోని వినోభానగర్లో ‘కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించారు. దాదాపు 250 ఇళ్లలో సోదాలు నిర్వహించి, సరియైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 70ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, ఒక కారును సీజ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ చంద్రభాను పలు సూచనలు చేశారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మట్కా, జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడేవారికి చెందిన సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఏవైనా విపత్కర సమయాల్లో ఆపదలో ఉన్నప్పుడు డయల్ -100 కు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలు పొందాలని ఆయన తెలిపారు. సైబర్ నేరాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేరాల నియంత్రణ కోసం తమ నివాస ప్రాంతాలలో సీసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

