అంగన్వాడీ కేంద్రాలకు కార్పొరేట్ స్థాయి వసతులు : కలెక్టర్

అంగన్వాడీ చిన్నారులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ
✍️ పాల్వంచ – దివిటీ (జూన్ 17)
కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధిలో తీర్చిదిద్దుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ పేర్కొన్నారు.
పాత పాల్వంచలోని మండల ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ పాల్వంచ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్తు, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. పిల్లలకు అవసరమైన ఆహారం, విద్య, ఆటపాటలతో కూడిన వాతావరణం, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, అన్నింటినీ సమగ్రంగా అందిస్తున్నారన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అనుభవజ్ఞులైన టీచర్లను నియమించి వారికి ప్రత్యేక శిక్షణనిస్తున్నామని, వారు చిన్నారుల మానసిక, భౌతిక అభివృద్ధికి తగిన తరగతులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ వివరించారు. తల్లిదండ్రులందరూ తమ చిన్నారులను ఖరీదైన ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించి ఆర్థికభారం మోయనవసరం లేదని, అంగన్వాడీ కేంద్రాల్లోనే ఆధునిక వసతులతో కూడిన విద్యాబోధన అందుబాటులో ఉందని చెప్పారు. ముందు అంగన్వాడీలలో, ఆ తర్వాత ప్రభుత్వపాఠశాలల్లో చదివించాలని, ఇవే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాస్, మహిళా శిశు, వయోవృద్దుల, దివ్యంగుల శాఖ జిల్లా అధికారి స్వర్ణలత లెనినా, పాల్వంచ సీడీపీఓ లక్ష్మీప్రసన్న, పాత పాల్వంచ స్థానిక జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మలత, ఉపాధ్యాయులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, పిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.