Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadLife StyleNational NewsSpot NewsTelangana

వర్షాకాలం సీజనుకు సన్నద్ధంగా ఉండాలి

వర్షాకాలం సీజనుకు సన్నద్ధంగా ఉండాలి

జిల్లాల కలెక్టర్లతో వీసీలో సీఎం రేవంత్ రెడ్డి

✍️ హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మే 27)

రాష్ట్రంలో ఈసారి పదిహేను రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని అంశాల్లో సన్నద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడం, మిగిలిపోయిన చోట ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ఇసుక అక్రమ రవాణా వంటి కీలకమైన పలు అంశాలపై సీఎం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. వానాకాలం సీజన్ కు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించి జూన్ 1 నాటికి నివేదికలు అందజేయాలని చెప్పారు. రాబోయే నెలరోజులు పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగెత్తించాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, సేకరించిన ధాన్యంపై 48 గంటల్లో రైతులకు రూ. 12,184 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 90 శాతం మేరకు ధాన్యం సేకరణ పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కలెక్టర్లను అభినందించారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించే విషయంలో అక్కడక్కడ ఇబ్బందికరంగా మారిన విషయాన్ని ప్రస్తావించి తీసుకోవలసిన చర్యలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 29శాతం అధిక వర్షపాతం నమోదైందని, సీజన్ ముందుగా రావడంతో ప్రత్యేకంగా వ్యవసాయశాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మిగిలిపోయిన చోట్ల ధాన్యం సేకరణ విషయంలో కలెక్టర్లు ప్రో యాక్టివ్‌గా ఉండాలని, ఈ వానాకాలం సీజన్‌లో తీసుకోవలసిన చర్యలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా తీసుకోవలసిన చర్యలను వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ జి.వి.పాటిల్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

Divitimedia

బూర్గంపాడులో మొక్కలు నాటిన అధికారులు

Divitimedia

ఎంసీఎంసీ పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలి : కలెక్టర్ డా.ప్రియాంకఅల

Divitimedia

Leave a Comment