భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు
వాహనతనిఖీల్లో రూ.3.49 కోట్ల విలువైన గంజాయి పట్టివేత


✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మే 24)
తమకందిన విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి పోలీసులు, జిల్లా సీసీఎస్ పోలీసులు శనివారం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్యాలంపాడు క్రాస్ రోడ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేశారు. ఆ సమయంలో హర్యానా రాష్ట్రానికి చెందిన కారు(నెంబర్ HR05BK6032) ఎస్కార్టుగా ముందు వస్తుండగా, దాంతో పాటు వెనుక (నెంబర్.HR63E7315) ఐషర్ వ్యాన్ వస్తున్నట్లు వెల్లడించారు. ఆ వాహనాలను అనుమానంతో ఆపి తనిఖీ చేయగా ఐషర్ వ్యాను లోపల ప్యాకెట్లుగా దాచిపెట్టి రవాణా చేస్తున్న 698 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయి గుర్తించారు. దాదాపు రూ.3.49 కోట్ల విలువ గల ఆ గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఐచర్ వ్యాను లో ఉన్న ముగ్గురు వ్యక్తులతో పాటుగా కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి ప్రాథమిక వివరాలు తెలుసుకున్నారు.
ఆ గంజాయి అమ్మిన వ్యక్తులు, దానిని కొనుగోలు చేసిన వ్యక్తులు రవాణా చేస్తున్న వ్యక్తులందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన ఐచర్ వ్యాన్, కారుతో సహా ఆ నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 5 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు అటవీప్రాంతం నుంచి హర్యానా రాష్ట్రం లోని కురుక్షేత్ర ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని వివరించారు. పట్టుబడిన ఆ నిందితులందరూ హర్యానాలో కురుక్షేత్ర జిల్లాకు చెందిన ప్రిన్స్ కుమార్ అనే వ్యక్తి ఆదేశాలతో పార్సిల్ సర్వీస్ మాటున ఆ గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు. ఈ సంఘటనలో పట్టుబడిన ఆరుగురు వ్యక్తుల వివరాలు పోలీసులు వెల్లడించారు.హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాకు చెందిన డ్రైవర్ సందీప్ కుమార్ అలియాస్ రింకు, అదే రాష్ట్రంలో కౌతాన్ జిల్లాకు చెందిన ఐషర్ వ్యాన్ క్లీనర్ గా ఉన్న లక్విందర్ ను అరెస్టు చేశారు. వారి తోపాటు అమర్నాధ్ కుమార్ అలియాస్ అమర్నాధ్ (వృత్తి: ఎలక్ట్రీషియన్, హర్యానా రాష్ట్రం, కురుక్షేత్ర జిల్లా), పవన్ కుమార్ (వృత్తి : కారు డ్రైవర్, పానిపట్ జిల్లా, హర్యానా రాష్ట్రం), రాజ్ కుమార్ అలియాస్ వినోద్ (వృత్తి : రాడ్ బెండింగ్ వర్కర్, జోగ్నకేర, కురుక్షేత్ర జిల్లా, హర్యానా రాష్ట్రం), కృషన్ కుమార్ అలియాస్ కాలే (వృత్తి :కారు డ్రైవర్, గోహన, సోనిపత్ జిల్లా, హర్యానా రాష్ట్రం) కూడా ఈ గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు చేశారు.
ఆ నిందితులకు హరిఖారా అనే వ్యక్తి గంజాయి అమ్మగా, హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రిన్స్ కుమార్ అనే వ్యక్తి దానిని కొనుక్కుని, ఆరుగురు నిందితుల ద్వారా హర్యానా రాష్ట్రానికి రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఆరుగురు వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు పోలీసులు ప్రకటించారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టేకులపల్లి సీఐ టి.సురేష్, ఎస్సై ఎ.రాజేందర్, సీసీఎస్ సీఐ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావులతోపాటు సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.