ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం
తెల్లవారుజామున జరిగిన సంఘటన
✍️ అమరావతి – దివిటీ (ఏప్రిల్ 4)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం రెండో బ్లాకులో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. సిబ్బంది సమాచారం ప్రకారం బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ప్రమాదం జరిగి, మంటలు చెలరేగాయి. వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన సంఘటనాస్థలాన్ని చేరుకుని మంటలార్పివేశారు. కాగా ఈ ప్రమాదానికి కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన జరిగిన రెండో బ్లాకులోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. తెల్లవారుజామున సంఘటన జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

