బొగ్గు, ఇసుక లారీలతో ఇబ్బందులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు
వినతిపత్రం అందజేసిన రాజుపేట గ్రామస్తులు
✍️ మణుగూరు – దివిటీ (మార్చి 31)
ఓవైపు బొగ్గు టిప్పర్లు, మరోవైపు ఇసుక లారీల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమ సమస్య పరిష్కరించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజుపేట గ్రామస్తులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్లో వారు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అంద జేశారు. మణుగూరు మున్సిపాలిటీలోని రాజుపేట గ్రామంలో 50 సంవత్సరాలుగా నివసిస్తున్నామని, రోజుకి సుమారు 700 ఇసుకలారీలు, బొగ్గుటిప్పర్లు విపరీతంగా తిరగడం వల్ల వచ్చే దుమ్ము ధూళి వల్ల అవస్థలు పడుతున్నామని పేర్కొన్నారు. తమకు శ్వాసకోశసమస్యలు ఏర్పడుతూ అనారోగ్యానికి గురవుతున్నామని, భారీ వాహనాల కారణంగా పిల్లలు, వృద్దులు రోడ్డుదాటే పరిస్థితి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారంతా వాపోయారు. గతంలో తాము సింగరేణి అధికారులతో మాట్లాడితే, ప్రతిరోజు రోడ్లపై నీళ్లుకొట్టిస్తామని చెప్పి ఆ మాట పక్కకు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దయ ఉంచి తమకు న్యాయం చేయాలంటూ రాజుపేట గ్రామస్తులు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.

