‘విచారణ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి…’
జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి భానుమతి
✍️ భద్రాచలం – దివిటీ (మార్చి 29)
విచారణ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి చెప్పారు. శనివారం భద్రాచలం స్పెషల్ సబ్ జైలు ను సందర్శించిన సందర్భంగా విచారణ ఖైదీలతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన నేరాలతో ఖైదీలుగా మారి జైలు జీవితం గడపాల్సి వస్తుందని, తద్వారా తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ఖైదీలను విచారించి, న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని నియమించనున్నట్లు తెలిపారు. జైలు పరిసరాలు, ఖైదీలకు వడ్డించే ఆహారం, సదుపాయాలు,ఆరోగ్య పరిస్థితుల గురించి విచారించారు. ఖైదీల్లో మార్పు కోసం కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు పాల్గొన్నారు.

