పారదర్శకంగా పూర్తయిన గిరిజన సంక్షేమ సిబ్బంది బదిలీలు
✍️ భద్రాచలం – దివిటీ (జులై 16)
తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఉత్తర్వులు (జీఓ.80) ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, డ్రైవర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, కుక్, కామాటి, వాచ్ మెన్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు చేశారు. ఈ మేరకు బదిలీల ప్రక్రియ పూర్తయినట్లు ట్రైబల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ మణెమ్మ తెలిపారు. మంగళ వారం పీఎంఆర్సీ భవనం సమావేశ మందిరంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశాల ప్రకారం అధికారుల కమిటీతో పాటు నాలుగో తరగతి ఉద్యోగుల కమిటీ సమక్షంలో ఈ బదిలీలు నిర్వహించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా ఈ బదిలీలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 శాతం సిబ్బందికి బదిలీలు చేయాల్సి ఉండగా, మొత్తం 81మందిని బదిలీ చేశామని, ఈ బదిలీల ప్రక్రియలో భార్యాభర్తలు, వికలాంగులు, మెడికల్ అంశాలపరంగా, వితంతు మహిళలకు ప్రాధాన్యతనిచ్చి కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. బదిలీల్లో 15 మంది జూనియర్ అసిస్టెంట్లకుగాను 9మంది, 14మంది రికార్డ్ అసిస్టెంట్ల కుగాను 9 మంది, 27మంది ఆఫీస్ సబార్డినేట్లకుగాను 15 మందిని బదిలీ చేశారు. 24మంది కుక్ లకుగాను 15 మందిని, 34మంది కామాటిలలో 19మంది, 16 మంది వాచ్మెన్లకుగాను 12 మంది, ఇద్దరు డ్రైవర్లలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేశామని డీడీ వివరించారు. బదిలీల ప్రక్రియ ఎటువంటి పొరపాట్లు లేకుండా, పారదర్శకంగా, సిబ్బంది అందరూ సంతృప్తి చెందేలా పూర్తి చేసినట్లు డీడీ మణెమ్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓ నరసింహారావు, చంద్రమోహన్, రాధమ్మ, పర్యవేక్షకురాలు ప్రమీలాబాయి, కార్యాలయ సిబ్బంది రమణమూర్తి, నారాయణ, రంగయ్య, అశోక్, సురేష్, శ్రీధర్, శేఖర్, రమణ, రమాదేవి పాల్గొన్నారు.