వలస ఆదివాసీ గ్రామంలో పోలీసుల ఉచిత వైద్య శిబిరం
ఆదివాసీలకు ఆరోగ్యసౌకర్యాలందించిన పోలీసులు
✍️ దుమ్ముగూడెం – దివిటీ (జులై 10)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు దుమ్ముగూడెం మండలం నారాయణరావుపేట గ్రామపంచాయతీలోని సిరిగుండం వలస ఆదివాసీల గ్రామంలో దుమ్ముగూడెం పోలీసులు బుధవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. దుమ్ముగూడెం స్థానిక పి.హెచ్.సి వైద్యసిబ్బంది సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, గ్రామస్తులకు ఉచిత వైద్యపరీక్షలు చేసి, మందులు అందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన, మారుమూల వర్గాలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. ఇటీవల కాలంలో వర్షాలు అధికంగా పడి దోమల వల్ల డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసరమైతే వెంటనే పోలీస్ వారికి సమాచారమందించి సాయం పొందాలని కూడా సూచించారు. దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో గ్రామంలోని పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. గ్రామంలో నివసిస్తున్న 52 కుటుంబాలకు చెందిన దాదాపు 200 మంది ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు కూడా పొందారు. కార్యక్రమం ఏర్పాటు చేసిన దుమ్ముగూడెం పోలీసులను ఏఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ అశోక్, పి.హెచ్.సి డాక్టర్ పుల్లారెడ్డి, ఎస్సై గణేష్, ఆర్ఎస్సై హరీష్, సిబ్బంది పాల్గొన్నారు.