దేశంలో అత్యుత్తమ పోలీసుస్టేషనుగా రాజేంద్రనగర్ స్టేషన్
అవార్డు అందజేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
అభినందనలు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి
✍🏽 దివిటీ – హైదరాబాదు (జనవరి 5)
హైదరాబాదు రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ దేశంలోనే “బెస్ట్ పోలీసుస్టేషన్”గా ఎంపికైంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ శుక్రవారం (జనవరి 5) 2023 సంవత్సరానికి దేశంలోని అత్యుత్తమ పోలీసుస్టేషన్ల జాబితా ప్రకటించింది. భారత దేశంలోని అత్యుత్తమ పోలీసుస్టేషన్లలో రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ మేరకు జైపూర్లో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) బి. నాగేంద్రబాబు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ ట్రోఫీని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పరిధిలోని రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ జాతీయస్థాయిలో అత్యుత్తమ స్థానం సాధించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సంబంధిత పోలీసు అధికారులకు అభినందనలు తెలియజేశారు.