Divitimedia
Bhadradri KothagudemHyderabadNational NewsPoliticsSpecial ArticlesTelangana

ఊపందుకోనున్న అగ్రనేతల ఎన్నికల ప్రచారం

ఊపందుకోనున్న అగ్రనేతల ఎన్నికల ప్రచారం

అక్టోబరు నెలాఖరులో అమిత్ షా, కేసీఆర్ పర్యటనలు

✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ (అక్టోబరు) నెలాఖరు నుంచి ఊపందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబరు 3వ తేదీన నామినేషన్లఘట్టం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలనుంచి అగ్రనేతల పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నెల 27న రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. అమిత్ షా సూర్యాపేటలో బీజేపీ నిర్వహించబోతున్న భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఆ సందర్భంలోనే తెలంగాణ బీజేపీ నేతలతో, అసంతృప్త నేతలతోనూ ఆయన విడివిడిగా భేటీకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితితోపాటు తమ ప్రత్యర్థులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల స్థితి గతులపై ఆరాతీయడం, బీజేపీ శ్రేణులకు ఎన్నికలప్రచారంపై దిశానిర్దేశం చేసే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో గతంలోకంటే ఈ ఎన్నికల్లో తమ పరిస్థితి మెరుగైందని, కాస్త కష్టపడితే నిర్ణయాత్మక పాత్ర పోషించగలిగే స్థాయిలో ఫలితాలు రాబట్టవచ్చని ఆ పార్టీ అధినాయకత్వం వ్యూహాలు అమలుచేస్తూ ఉంది. బీజేపీకి ఆదరణ ఉన్న ప్రాంతాల్లో ఆ సానుకూలతను క్యాష్ చేసుకోవడం కోసం ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ‘ప్రిఫైనల్’ లాంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటితే పరిస్థితులు మరింత సానుకూలంగా మారుతాయంటూ అంచనా వేస్తున్న బీజేపీ తదనుగుణంగానే ఈ ఐదురాష్ట్రాల అసెంబ్లీఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అగ్రనేతల పర్యటనలకు ప్లాన్ రూపొందించింది. మరోవైపు ఈ నెలాఖరున బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ పర్యటన కూడా స్వల్పమార్పులతో ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆయన అక్టోబరు 26వ తేదీన అచ్చంపేట, వనపర్తి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ మరుసటిరోజు (అక్టోబరు 27న) పాలేరుతో పాటు మహబూబాబాద్, వర్దన్నపేటలోనూ కేసీఆర్ పర్యటన సాగనుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బాగా వ్యతిరేకత ఏర్పడిన ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటనల ద్వారా దాన్ని అధిగమించి, సానుకూలత పెంచుకునేలా ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయపరిశీలకుల అంచనా. తమకు సానుకూలత కనిపిస్తున్న ప్రాంతాల్లో కేటీఆర్, హరీష్ రావు, తదితర నేతలతో ప్రచారం చేయిస్తే సరిపోతుందని బీఆర్ఎస్ నిర్ణయంతీసుకున్నట్లు తెలిసింది. కేసీఆర్ వయసు, ఆరోగ్యపరిస్థితుల దృష్ట్యా తప్పని పరిస్థితి ఏర్పడిన కొన్ని ప్రాంతాల్లోనే ఆయన పర్యటనలుంటాయని పార్టీ వర్గాల సమాచారం. ఇంకొకవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పార్టీ అగ్రనాయకుల పర్యటనలు, పెరుగుతున్న సానుకూలస్థితి కాంగ్రెస్ నాయకులలో ఆశలు రేకెత్తించింది. ప్రభుత్వ వ్యతిరేకత, తమకు పెరుగుతున్న సానుకూలతను ఒడిసి పట్టుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా సగానికిపైగా ప్రాంతాల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోవడం, ఇంకా వామపక్షాలతో సీట్ల సర్దుబాటు కాకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రచారం పలు ప్రాంతాల్లో వెనుకబడే ఉంది. నామినేషన్ల ఘట్టం పూర్తి అయిన తర్వాతే కాంగ్రెస్ ప్రచారంలో ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts

సంతోష్ ట్రోఫీ పోటీలకు ఆతిథ్యమివ్వడం సంతోషకరం

Divitimedia

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఐటీడీఏ పీఓ

Divitimedia

సి-విజిల్ యాప్, ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించాలి

Divitimedia

Leave a Comment