బ్రిలియంట్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
సారపాక బ్రిలియంట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రిలియంట్స్ విద్యార్థులు జాతీయపతాకాలతో, సారపాక వీధులలో నినాదాలతో, స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సారపాక ప్రధాన కూడలి వద్ద విద్యార్థులు ప్రదర్శించిన పలు విన్యాసాలు అందరినీ అలరించాయి. స్థానికులు కూడా విద్యార్థులతో కలిసి జాతీయ నినాదాలతో హోరెత్తించారు. తదనంతరం జరిగిన జెండా వందనం కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థల అధినేత బి నాగేశ్వరరావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎదుటి వారికి సాయం చేయాలని, దేశంలో సమైక్య భావనతో కల్లోలపరిస్థితులను నివారించేలా ముందుకు సాగాలని కోరారు. విద్యార్థులలో దేశంపై భక్తి భావన పెంపొందించడం, వారిని దేశాభివృద్ధి వైపు నడపడం ముఖ్యమైందని వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి మనందరి బాధ్యతని తెలియజేశారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, సాంస్కృతిక కార్యక్రమాలలో పోటీలు నిర్వహించి, విజేతలకు బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ నాగేశ్వరరావు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాలలో ఉపాధ్యాయలు, అధ్యాపక బృందం, విధ్యార్ధులు, వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.
