సీఎం పర్యటకు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్ష
అంజనాపురం పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
✍️ దివిటీ మీడియా





ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం అంజనాపురంలో కొత్తగా నిర్మించిన గోదైజ్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అక్కడ చేస్తున్న ఏర్పాట్లను ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీసు కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి బుధవారం సమీక్షించారు. ఫ్యాక్టరీ, సభావేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలు, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు, గోదైజ్ సంస్థ ప్రతినిధులకు సూచనలు చేశారు. రైతులు, ప్రజలు తరలివచ్చే అవకాశమున్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
సభా ప్రాంగణంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు శాస్త్రీయంగా రూపొందించి, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, మీడియా ప్రతినిధులు, ప్రజల కోసం ప్రత్యేక మార్గాలు, ప్రత్యేక కూర్చునే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. బ్యారికేడింగ్, సూచిక బోర్డులు, తగిన వెలుతురు, తాగునీటి సదుపాయం, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా బహుస్థాయి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ప్రయాణ మార్గాలను ముందుగానే పూర్తిస్థాయిలో పరిశీలించి, రహదారుల మరమ్మతులు, శుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పూర్తి చేయాలని తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసి, ప్రజలకు ముందస్తుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, గోదైజ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

