ఆర్గానిక్ అటవీ ఉత్పత్తులు అద్భుతం

భద్రగిరి మార్ట్ పరిశీలించిన ట్రైఫెడ్ ఏడీ ఆరిఫ్ వలి
✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
భద్రాచలం పట్టణ ప్రజలకు అడవులలో దొరికే అటవీ ఉత్పత్తులు, సేంద్రియ ఆర్గానిక్ ఉత్పత్తులు అందించేందుకు, ఎస్.హెచ్.జి, గిరిజన మహిళలకు ఆర్థిక చేయూతనందించడానికి ఎంతో దూర దృష్టితో భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ కృషితో ఏర్పాటు చేసిన భద్రగిరిమార్ట్ అద్భుతంగా ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రైఫెడ్ అదనపు సంచాలకులు సయ్యద్ ఆరిఫ్ వలీ అన్నారు. ఈ సందర్భంగా పీఓ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. గురువారం భద్రాచలంలోని భద్రగిరిమార్ట్ ను ఆయన ట్రైఫెడ్ సంస్థ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈ మార్ట్ లోని అటవీ ఉత్పత్తులను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగకరమైన అటవీ వస్తువులను అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమని, ఇవి ప్రజలకెంతగానో ఉపయోగపడతాయన్నారు. గిరిజన మహిళలు, ఆర్గానిక్ పంటలు పండించే గిరిజన రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడంతోపాటు స్థానిక గిరిజన కుటుంబాలకు ఆర్థిక బలాన్ని అందించే సదాశయంతో ఏర్పాటుచేసిన ఈ మార్టు నకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని న్యూఢిల్లీలోని ట్రైఫెడ్ కార్యాలయంలో నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఇక్కడ అందుబాటులో ఉన్న గిరిజన సాంప్రదాయ ఉత్పత్తులు, వారి ప్రతిభకు సరైన గుర్తింపునివ్వడమే కాకుండా జీవనోపాధి మెరుగుపరచడం లక్ష్యంగా ఈ మార్ట్ ఏర్పాటు చేయడం, ప్రతి నిత్యవసర సరుకుల నాణ్యత, వినియోగదారులకు, కొనుగోలుదారులకు అందిస్తున్న రేట్లను పరిశీలించామన్నారు. భద్రగిరి మార్టును పరిశీలించిన ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ మార్ట్ లో నిత్యావసర సరుకుల స్టాకు, నిర్వహణ, వస్తువుల నిల్వ, అమ్మకాలు జరిపిన అంశాలను పరిశీలించారు. ఆ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మిక్కీ పచ్చళ్ల తయారీ కేంద్రం కూడా పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర గిరిజన వ్యవహార మంత్రిత్వ శాఖ సభ్యులు నేహాశర్మ, మన్ సిమ్రాన్ కౌర్, ఐటిడిఏ మేనేజర్ ఆదినారాయణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

